రష్యా అత్యంత పాశవికంగా ఉక్రెయిన్పై విరుచుకుపడుతూనే వుంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సామాన్యులపై కూడా రష్యా విచక్షణా రహితంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లెత్సా ఓ సందేశాన్ని చదివి వినిపించారు.ఈ సందేశం ఓ రష్యా సైనికుడిది. ఆ రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చిట్ట చివరి సందేశం. ఈ సందేశం చదివితే.. పుతిన్ యుద్ధం ఉక్రెయిన్లో ఎంత బీభత్సాన్ని సృష్టిస్తోంది, రష్యా సైనికులు ఎంత ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ యుద్ధం చేస్తున్నారో అర్థమవుతోంది.
అమ్మా…. నేను ఉక్రెయిన్లో ఉన్నాను. ఇక్కడ జరిగేది నిజమైన యుద్ధమే. సందేహం లేదు. నేను భయపడుతున్నా. అన్ని నగరాలపై బాంబు దాడులు చేస్తున్నాం. సామాన్య ప్రజానీకాన్నీ టార్గెట్ చేస్తున్నాం. వారిపై కూడా బాంబులు వేస్తున్నాం. ఉక్రెయిన్లు మాకు స్వాగతం పలుకుతారని ఉన్నతాధికారులు అన్నారు. కానీ… వారందరూ మా వాహనాల కిందే పడిపోతున్నారు. ఏకంగా చక్రాల కిందే పడిపోతున్నారు. మమ్మల్ని కదలనివ్వడమే లేదు. మమ్మల్ని ఫాసిస్టులంటూ తిడుతున్నారు. అమ్మా… ఇక్కడ చాలా కఠినంగా ఉంది. అంటూ ఆ సైనికుడు వాళ్ల అమ్మతో చెప్పిన మాటలు. ఈ మాటలను ఉక్రెయిన్ రాయబారి ఐరాసలో చదువుతుంటే సభ్యులందరూ అట్లే విన్నారు. దీన్ని బట్టి ఉక్రెయిన్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సైనికుడు యుద్ధంలో చనిపోయే ముందు తన తల్లికి చివరి సారిగా పంపిన సందేశమని ఐరాస ఉక్రెయిన్ రాయబారి సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.
ఇదంతా వాళ్ల అమ్మకు ఎందుకు చెప్పినట్టు?
ఉక్రెయిన్లో జరుగుతున్న వ్యవహారాన్ని రష్యా సైనికుడు వాళ్ల అమ్మకు ఎందుకు చెప్పాడు? అంటే.. వాళ్ల అమ్మ కొద్ది రోజుల క్రితమే ఆ రష్యా సైనికుడికి ఓ ఉత్తరం రాసింది. అయితే దానికి జాబు రాయడానికి ఆ సైనికుడు చాలా సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? అంటూ ఆ సైనికుడి తల్లి ఆయన్ను అడిగింది. ఎమైనా ట్రైనింగ్లో ఉన్నావా? అంటూ ఆయన్ను అడిగింది. లేదమ్మా.. నేను ఉక్రెయిన్లో ఉన్నాను అంటూ ఆ సైనికుడు సమాధానం చెబుతాడు.