హైదరాబాద్: ఉక్రెయిన్లో రష్యా (Russia) దాడులు ఉధృతం చేసింది. దేశంలోని ప్రధాన ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నది. ఇప్పటికే రెండు అణువిద్యుత్ కేంద్రాలతోపాటు ఓడరేవు పట్టణం ఖేర్సన్ను ఆదీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మరో అణువిద్యుత్ కేంద్రంపై దృష్టిసారించింది. తొలుత చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా, తర్వాత ఐరోపాలోనే అతిపెద్దదైన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను తమ ఆదీనంలోకి తీసుకున్నది. మూడో అణువిద్యుత్ కేంద్రమైన యుజ్నౌక్రైన్స్క్(Yuzhnoukrainsk)ను స్వాధీనంచేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. యుజ్నౌక్రైన్స్క్ ప్లాంట్ ఉన్న మైకోలైవ్ పట్టణానికి ఉత్తరంగా 120 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.
కాగా, ఉక్రెయిన్లో పదకొండో రోజూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఖేర్సన్ను ఆక్రమించిన రష్యా బలగాలు.. సముద్ర తీర ప్రాంతాలైన మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను చుట్టుముట్టాయి. కీవ్పై రష్యా దళాలు బాంబుదాడులు కొనసాగిస్తున్నది. రాజధానిపై పట్టుకోసం తీవ్రంగా యత్నిస్తున్నది. అయితే ఉక్రేనియన్ దళాలు ప్రతిఘటిస్తుండటంతో కీవ్ ఆక్రమణకు మాస్కో బలగాలు కష్టపడాల్సి వస్తున్నది.