కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఐదో రోజుకు చేరింది. ఇరు దేశాలు ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు తలపడుతున్నాయి. రాజధాని కీవ్ స్వాధీనానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ గట్టిగా ప్రతిఘటిస్తున్నది. ఈ నేపథ్యంలో రష్యా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కీవ్ నగరాన్ని ఖాళీ చేయాలని ఉక్రేనియన్లకు సూచించింది. దీంతో సోమవారం ఉదయం కీవ్లో వైమానిక దాడి సైరన్లు హోరెత్తాయి.
మరోవైపు ఉక్రెయిన్ అధికారులు కూడా పౌరులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఇంట్లో లేదా సమీపంలోని బాంబ్ షెల్టర్లో ఉండాలని సూచిస్తున్నారు. కీవ్ స్వాధీనానికి రష్యా దళాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరును ఖండించే పోస్టర్లు కీవ్ వ్యాప్తంగా కనిపించాయి.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ఇప్పటి వరకు 102 మంది పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్) అంచనా వేసింది. చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ను వీడినట్లు పేర్కొంది. అయితే ఇరు దేశాల సైనికుల ప్రాణ నష్టం వివరాలు వెల్లడించలేదు.