న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ప్రకటించిన కొద్దిసేపట్లోనే సైన్యం దాడులకు దిగింది. రాజధాని కీవ్తో సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ సైనికులు 40 మంది చనిపోయాగా.. సాధారణ పౌరులు పది మంది వరకు మృతి చెందారు. అయితే, 300 వరకు పౌరులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. రష్యా దాడులను ఎదుర్కొంటూనే.. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే ప్రపంచదేశాలు యుద్ధాన్ని ఆపాలని రష్యాపై ఒత్తిడి తెస్తుండగా.. మధ్యలో ఎవరు కలుగజేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని పుతిన్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ భారత్ సాయాన్ని కోరింది. భారత్లోని ఉక్రెయిన్ రాయబారి ఇగర్ పోలిఖా ఒక ప్రకటన చేశారు. రష్యాతో భారత్కు ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా ఉక్రెయిన్ – రష్యా సంక్షోభాన్ని నియంత్రించడంలో భారత్ కీలకంగా వ్యవహరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీలతో సంప్రదింపులు జరపాలని పోలిఖా విజ్ఞప్తి చేశారు.
ఇటీవలే ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై స్పందించిన భారత్.. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని, శాంతికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ స్పందన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఉక్రేనియన్ విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలపై రష్యా బాంబు, రాకెట్ దాడులు చేసింది. రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో బాంబుల మోత మోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక.. బతికుంటామో లేదో తెలియక భయాందోళనకు గురవుతున్నారు.