Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే తమ సైనికుల తల్లులను కలుస్తారని సమాచారం. రష్యాకు చెందిన ది వెడొమొస్తి పత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఇదే విషయాన్నిరష్యాలోని మూడు వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. రష్యాలో నవంబర్ 27వ తేదీని మదర్స్ డేగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొంటున్న సైనికుల తల్లులను కలిసి, వాళ్లతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. అయితే, అలాంటి సమావేశం ఉంటే గనుక మేము కచ్చితంగా తెలియజేస్తాం అని క్రెమ్లిన్ అధికారి దిమిత్రి పెస్కోవ్ ఒక ప్రకటనలో తెలిపాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ మీద రష్యా సైనిక దాడికి దిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ ఉక్రెయిన్ సైన్యం 85వేల మంది రష్యా సైనికులను అంతమొందించిందని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈమధ్యే ప్రకటించింది. యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా కూడా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. రష్యా సెప్టెంబర్లో ఉక్రెయిన్లోని నాలుగు పట్టణాలను స్వాధీనం చేసుకుంది. డొనెట్స్క్, లుహన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్నాయి.