వాషింగ్టన్: ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఏ క్షణమైనా రష్యా ఆక్రమణకు వెళ్లవచ్చు అని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులు అంతా 48 గంటల్లో ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. ఏరియల్ బాంబింగ్తో ఆక్రమణ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అంచనా వేసింది. ఒకవేళ వైమానిక దాడులు మొదలైతే అప్పుడు అక్కడ నుంచి డిపార్ట్ కావడం ఇబ్బందికరంగా మారుతుందని, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతాయని వైట్హౌజ్ పేర్కొన్నది. కానీ మరో వైపు రష్యా మాత్రం పదేపదే ఆక్రమణ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ఉక్రెయిన్తో ఉన్న సరిహద్దు వద్ద సుమారు లక్ష మంది దళాలను రష్యా మోహరించిన విషయం తెలిసిందే. అమెరికాతో పాటు పలు ఇతర దేశాలు కూడా తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. ఉక్రెయిన్ వదిలివెళ్లాలని ఆదేశించాయి. ఆ జాబితాలో బ్రిటన్, కెనడా, నెదర్లాండ్స్, లత్వియా, జపాన్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమించనున్నట్లు వస్తున్న వార్తలను రష్యా ఖండించింది. పశ్చిమ దేశాలు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి తెలిపారు.
రష్యా దళాలు భారీ సైనిక చర్యకు దిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తును అంచనా వేయలేకపోతున్నామని, ఏం జరగబోతుందో కచ్చితంగా తెలియడం లేదని, కానీ రిస్క్ మాత్రం ఎక్కువే ఉందని, రాబోయే ప్రమాదం కూడా అర్థం అవుతుందని జేక్ తెలిపారు. అయితే ఉక్రెయిన్పై ఆక్రమణకు వెళ్లడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తుది నిర్ణయం తీసుకున్నాడో లేదో ఇంకా తెలియదన్నాడు. కానీ సైన్యం మాత్రం మొదట వైమానిక దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోందన్నాడు. ఒకవేళ రష్యా వైమానిక దాడులు ప్రారంభిస్తే, అప్పుడు ఎవర్నీ ఆదుకోలేమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ అంశంపై బైడెన్, మాక్రన్లు ఇవాళ పుతిన్తో ఫోన్లో మాట్లాడనున్నారు.