హైదరాబాద్: ఉక్రెయిన్లో బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా (Russia) తాత్కాలికంగా కాల్పులను విరమించింది (Ceasefire). పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నావఖా పట్టణాలను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. అయితే యుద్ధ క్షేత్రం నుంచి పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది. మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి ఐదున్నర గంటలపాటు కాల్పులను విరమిస్తున్నట్లు (Ceasefire) రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
హ్యూమన్ కారిడార్ కోసం వోల్నావఖా, మరియుపోల్లో కాల్పులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపింది. ఈ సమయంలో ప్రజలకు ఆహారం అందించనున్నారు. దీంతోపాటు ప్రాథమిక చికిత్స చేయనున్నారు. దీంతోపాటు రెండు పట్టణాల్లో విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నది.
గత పదిరోజులుగా ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఇప్పటికే ఖేర్సన్ నగరంతో అణువిద్యుత్ కేంద్రాలైన చెర్నోబిల్, జపోరిజియా పవర్ ప్లాంట్ను తమ ఆధీనంలో తీసుకున్నది. రాజధాని కీవ్పై బాంబుల దాడిని ఉధృతి చేసింది. ఉక్రెయిన్ బలగాలు ప్రతిగటిస్తుండటంతో కీవ్ ఆక్రమణకు రష్యన్ బలగాలు శ్రమిస్తున్నాయి.
జపోరిజియా పవర్ ప్లాంటు స్వాధీనంతో రష్యా తన ఆక్రమణ పర్వంలో ఒక దశను విజయవంతంగా పూర్తి చేసినైట్టెంది. భౌగోళికంగా ఉక్రెయిన్లో ఒక భాగాన్ని పూర్తిగా వశపర్చుకొన్నది. తూర్పు ఉక్రెయిన్లో నీపహ్ నది చాలా కీలకమైనది. ఇది దేశాన్ని రెండుగా విభజిస్తున్నది. ఈ రెండు భాగాల మధ్య వారధిలా ఉన్నది జపోరిజియా పవర్ ప్లాంటు మాత్రమే. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్ నుంచి తూర్పు భాగాన్ని పూర్తిగా వేరు చేసింది. ఉక్రెయిన్ నియంత్రణ నుంచి తప్పించింది.