Russia : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య ఏండ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ డ్రోన్లు నిరంతరం రష్యా ఇంధన సరఫరా వ్యవస్థలపై దాడులు చేస్తున్నాయి. దాంతో రష్యాలో చమురుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల చమురు ఎగుమతులను నిలిపివేయాలని క్రెమ్లిన్ (Kremlin) ఆదేశించింది.
సమ్మర్ సీజన్లో ఉక్రెయిన్ పూర్తిగా రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాలు, ఇంధన సరఫరా రైళ్లను టార్గెట్ చేసింది. సాధారణంగా ఆ సీజన్లోనే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇంధన డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దాంతో దేశంలో ఇంధన కొరతను సృష్టించడమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు ప్లాన్ చేసింది. ఫలితంగా ఇంధన కొరత ఏర్పడింది.
అయితే రష్యా అధికారులు మాత్రం ఈ నిషేధానికి రవాణా వ్యవస్థల్లో కొరతను కారణంగా చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ మునుపటిలా సరఫరా చేస్తామని అంటున్నారు. కానీ ఉక్రెయిన్ మాత్రం తాము రష్యాలోని పలు ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు చెబుతోంది. దక్షిణ రష్యాలో గ్యాజ్ప్రోమ్ నిర్వహిస్తున్న ఓ భారీ చమురు శుద్ధి కేంద్రాన్ని కూడా ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసంచేశాయి.
ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు రష్యా మార్చిలో కూడా తమ దేశం నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్లో కొంత బ్యాన్ విధించింది. మళ్లీ జూలైలో ఆ బ్యాన్ను తొలగించింది. తాజాగా గురువారం ఆ దేశ డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నొవాక్ ఈ నిషేధాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. డీజిల్లో కూడా కొంతమేరకు ఎగుమతిని ఆపినట్లు తెలిపారు. కాగా క్రిమియాలో సగం పెట్రోల్ పంపులు నిల్వలు లేక మూతపడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. చాలాచోట్ల వాహనాలు ఇంధనం కోసం బారులుతీరినట్లు తెలిపింది.