Ruchira Kamboj : అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్యసమితిలో దాయాది దేశం పాకిస్థాన్ తీరును భారత్ ఎండగట్టింది. చెప్పిందే చెప్పే చెత్త రికార్డు పాకిస్థాన్ సొంతమని విసుగును ప్రదర్శించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ (UNGA) లో అయోధ్య రామాలయం, సీఏఏ అమలు గురించి ఆ దేశ రాయబారి అసందర్భ వ్యాఖ్యలు చేయడంతో భారత్ తీవ్రంగా ఖండించింది.
ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ, ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి తప్పుడు ప్రస్తావన చేశారు. దీనిపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. నా దేశానికి సంబంధించిన విషయాలపై పాకిస్థాన్ ప్రతినిధి బృందం సంకుచిత, తప్పుదోవ పట్టించే దృక్ఫథాన్ని కలిగి ఉండటం దురదృష్టకరమన్నారు.
ఈ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్థాయి కలిగిన లోతైన అంశాల గురించి పరిగణిస్తుంటే.. మీ దగ్గర నుంచి భిన్నమైన వైఖరి కనిపిస్తోందని కాంబోజ్ మండిపడ్డారు. ఎప్పుడూ చెప్పిందే చెప్పే చెత్త రికార్డు కలిగిన పాకిస్థాన్ ప్రతినిధి బృందం.. ప్రపంచం పురోగమిస్తోన్న తరుణంలో స్తబ్ధుగా ఉండటం విచారకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఇటీవల కేంద్రం సీఏఏను నోటిఫై చేసింది. పొరుగు దేశాల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరలకు ఇక్కడి పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చేసింది.
కొద్దిరోజుల క్రితం కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి మనదేశం గట్టిగానే బుద్ధి చెప్పింది. ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయని భారత్ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు వారికి లేదని గట్టిగా హెచ్చరించింది.