లండన్, అక్టోబర్ 29: యువతకే స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు యూకే అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్షైర్కు చెందిన 94వేల మందిపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు 20 ఏండ్లపాటు అధ్యయనం నిర్వహించారు. 55 ఏండ్లలోపు యువకుల్లో స్ట్రోక్ ముప్పు 67శాతం ఉన్నట్టు తేల్చారు. అదే సమయంలో 55 ఏండ్లు దాటినవారికి కేవలం 15శాతం మాత్రమే ముప్పు ఉన్నట్టు కనుగొన్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే యువత ఎక్కువగా స్ట్రోక్కు గురవుతున్నారని గుర్తించారు. రక్త ప్రసరణకు అవరోధం కలగడం లేదా నరాలు చిట్లడం వల్ల సంభవించే అత్యవసర వైద్యపరిస్థితే స్ట్రోక్. మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వ్యక్తిని సకాలంలో దవాఖానకు తీసుకెళ్లకపోతే తీవ్ర నష్టం తప్పదు.