లండన్, జూలై 9: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా నేపథ్యంలో వారసుడెవరన్న దానిపై రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భారత సంతతికి చెందిన వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ కూడా రేసులో ఉన్నారు. జాన్సన్ తీరు పట్ల అసంతృప్తితో మొదటిగా రాజీనామా చేసిన రిషి సునక్.. ప్రధాని పదవి ఆశిస్తున్నారు. ఈ మేరకు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఎన్నికయ్యేందుకు శనివారం ఆన్లైన్ వేదికగా #Ready4Rishi వెబ్సైట్ పేరుతో ప్రచారం ప్రారంభించారు. తద్వారా నాయకత్వ రేసులో అందరికంటే ముందుగా అడుగు వేశారు. కరోనా సవాలు సమయంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను విజయవంతంగా నిర్వహించానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం నేటి తరానికి ప్రమాదకరమైన భారీ సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ఇటువంటి సమయంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని తన సందేశంలో అన్నారు. ఈ రోజున మన ఎంపికలే.. తర్వాతి తరం వారికి గతం కంటే మెరుగైన అవకాశాలను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. రిషి సునక్కు పలువురు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు మద్దతు పలికారు. వీరిలో కామన్స్ లీడర్ మార్క్ స్పెన్సర్, పార్టీ మాజీ చైర్మన్ ఒలివర్ డౌడెన్, మాజీ మంత్రి లియామ్ ఫాక్స్ ఉన్నారు.