టొరంటో: 1985 నాటి ఎయిర్ ఇండియా కనిష్కా విమానం బాంబు దాడి కేసులో నిర్దోషిగా బయటపడిన కెనడా వ్యాపారవేత్త రిపుదామన్ సింగ్ మాలిక్ను కాల్చి చంపారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రే పట్టణంలో ఈ ఘటన జరిగింది. 1985లో జరిగిన ఎయిర్ ఇండియా బాంబు దాడుల్లో 331 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనతో లింకు ఉన్న కేసులో రిపుదామన్ సింగ్ మాలిక్ ఆరోపణలు ఎదుక్కొన్నాడు. అయితే 2005లో అజైబ్ సింగ్ బాగ్రితో పాటు రిపుదామన్ మాలిక్ ఆ కేసులో నిర్దోషులుగా బయటపడ్డారు. ప్రస్తుతం రిపుదామన్ సింగ్ మాలిక్ వయసు 75 ఏళ్లు. మాలిక్ హత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. రిపుదామన్ సింగ్ మాలిక్ కుమారుడు జస్ప్రీత్ సింగ్ తన తండ్రి హత్యకు సంబంధించి ఓ ప్రకటన చేశాడు. ఎయిర్ ఇండియా బాంబింగ్ ఘటనతో తన తండ్రికి ఎటువంటి లింకు లేదని తన పోస్టులో జస్ప్రీత్ తెలిపాడు. రిపుదామన్ హత్య జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో ఓ కాలిపోయిన కారును పోలీసులు గుర్తించారు. కెనడాలోని మాంట్రియల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాన్ని 23 జూన్ 1985లో సిక్కు మిలిటెంట్లు పేల్చేశారు. అట్లాంటిక్ సముద్రం మీదుగా విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఆ బాంబు పేలింది. ఆ దుర్ఘటనలో 331 మంది మరణించారు. ఆ కేసుతో లింకున్న బబ్బార్ ఖల్సా మిలిటెంట్ సంస్థకు, రిపుదామన్ మధ్య సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.