జయ్ మల్హోత్రా ఓ పేరున్న వ్యాపారవేత్త. దశాబ్దం క్రితం తాను చేసిన ఓ యాక్సిడెంట్ వార్తలు ఇంకా నెట్టింట్లో ప్రచారంలో ఉండటంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి ‘గత’ జ్ఞాపకాలు చాలామంది మనసులను గాయపరుస్తూనే ఉన్నాయి. సినీ తారలు, రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు వచ్చిందే ‘రైట్ టూ బీ ఫర్గాటెన్’ ఉద్యమం.
ఏమిటీ ‘రైట్ టూ బీ ఫర్గాటెన్’?
వ్యక్తిగత జీవితంలో గతంలో జరిగిన ఘటనలను ఇంటర్నెట్, సోషల్మీడియా తదితర మాధ్యమాల నుంచి తొలగించేలా చేయడమే ‘మర్చిపోయే హక్కు’ ఉద్యమం ప్రధాన ఉద్దేశం. తప్పుచేయనప్పటికీ, కొన్నిసార్లు కొందరు బాధ్యులుగా మారడం చూస్తూనే ఉంటాం. ఇంటర్నెట్లో ఉండే అస్పష్ట సమాచారం వల్ల భవిష్యత్ తరాలు ఆ వ్యక్తులను తప్పుగా అర్థంచేసుకునే ప్రమాదం కూడా ఉన్నది. సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా ఇది జరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే ‘మర్చిపోయే హక్కు’ ఉద్యమం ప్రారంభమైంది.
అలా మళ్లీ తెరపైకి..
‘మర్చిపోయే హక్కు’ ఉద్యమం కొత్తదేమీకాదు. విదేశాల్లో ఇప్పటికే ఉన్నది. దీనిపై చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే, ఇంటర్నెట్లో ఉన్న తన వ్యక్తిగత సమాచారాన్ని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని హిందీ బిగ్బాస్-2, ఎంటీవీ రోడీస్ విజేత అశుతోష్ కౌశిక్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ‘మర్చిపోయే హక్కు’ ఉద్యమం మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో తనపై వచ్చిన ఆరోపణలు, వార్తలు ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉండటం వల్ల తాను మానసిక సంఘర్షణకు గురవుతున్నట్టు ఆయన పిటిషన్లో ఆరోపించారు. కాగా, ముంబైలోని ఓ కేఫ్లో గొడవపడటం, డ్రంకెన్ డ్రైవ్లో కౌశిక్ దొరికినట్టు వార్తలు ప్రచారమయ్యాయి.
భారత్లో ఈ చట్టం వర్తిస్తుందా?
యురోపియన్ యూనియన్ దేశాల్లో ఇప్పటికే ‘మర్చిపోయే హక్కు’ చట్టం అమల్లో ఉన్నది. ఇంటర్నెట్ నుంచి తమ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలనుకునేవారు ఆయా సంస్థలకు ఈ చట్టం ద్వారా ప్రతిపాదనలు పంపొచ్చు. భారత్లో 2019లో కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (పీడీపీ) బిల్లులో ‘మర్చిపోయే హక్కు’ను కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ బిల్లు.. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉన్నది. ఒకవేళ, ఈ బిల్లు చట్టంగా మారితే ‘మర్చిపోయే హక్కు’ మన దేశంలో కూడా అమల్లోకి వస్తుంది.