సిడ్నీ, ఫిబ్రవరి 2: కరెన్సీ నోటుపై దివంగత క్వీన్ ఎలిజబెత్-2 ఫొటోను తొలగించి కొత్తవి ముద్రించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. ముందుగా 5 డాలర్ల నోటుపై ఆమె ఫొటోను తొలగించి, ఆ స్థానంలో స్వదేశీ సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా, గౌరవించేలా కొత్త డిజైన్ రూపొందించనున్నది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. ప్రస్తుతం 5 డాలర్ల నోటుపై ఒక వైపు ఎలిజబెత్ రాణి-2 ఫొటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఫొటో ఉంటుంది. ఎలిజబెత్ ఫొటోను మాత్రమే తొలగిస్తామని ఆస్ట్రేలియా పేర్కొన్నది. కొత్త నోటు రూపకల్పనలో స్వదేశీ సమూహాలను సంప్రదిస్తామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కొత్త నోటు వచ్చే వరకు ప్రస్తుత నోటు చెలామణిలో ఉంటుందని పేర్కొన్నది. రాణి మరణం తర్వాత ఆమె కుమారుడు చార్లెస్ కింగ్ చార్లెస్-3.. బ్రిటన్ బయట ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా 12 కామన్వెల్త్ దేశాలకు అధిపతిగా ఉన్నారు.