వాషింగ్టన్, మే 28: అప్పుల పరిమితి పెంపుపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కారుకు ఊరట లభించింది. రెండేండ్ల పాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య సూత్రప్రాయంగా ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని రాజీపడటంగా బైడెన్ అభివర్ణించారు. ఈ ఒప్పందం జూన్ 5లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉన్నది. ఆ తర్వాత బైడెన్ దీనిపై సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఈ ఒప్పందం అమల్లోకి రాకపోతే, జూన్ 5 తర్వాత నుంచి అమెరికా అప్పులు చెల్లించే పరిస్థితిలో ఉండదని ఇప్పటికే ఆ దేశ ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా అప్పు 31.4 ట్రిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరుతున్నది.