SriLanka Deep Crisis | అసాధారణ రీతిలో శ్రీలంక దీనావస్థ పరిస్థితికి చేరుకోవడానికి చైనా ఆధిపత్య కాంక్షే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. చైనా బీఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా హంబాంటోటా పోర్ట్, కొలంబో పోర్ట్ నిర్మాణానికి శ్రీలంకకు భారీగా రుణాలిచ్చింది. అంతే కాదు.. ఆ రుణ చెల్లింపునకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. శ్రీలంక తీసుకున్న సుమారు 800 కోట్ల డాలర్ల రుణంలో మెజారిటీ డ్రాగన్ నుంచి తీసుకున్నది. దీనికితోడు కరోనా మహమ్మారితో శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న పర్యాటక రంగం పూర్తిగా కుప్పకూలిందని ది హంకాంగ్ పోస్ట్ పేర్కొంది. ఫలితంగా విదేశీమారక ద్రవ్యం నిల్వలు నిండుకున్నాయి. మరోవైపు రుణాలు పెరిగిపోయాయి. చైనా నుంచి మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించడానికి ఇష్టారాజ్యంగా తీసుకున్న రుణాల వల్లే ఈ దుస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 400 మిలియన్ల డాలర్ల లోపే.. ఇప్పటికే ఈ ఏడాదిలో 700 కోట్ల డాలర్ల రుణాలు చెల్లించాల్సిన దుస్థితిలో శ్రీలంక ఉంది.
శ్రీలంక ఇలా దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం 70 ఏండ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైం. అసాధారణ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు దేశ సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. పాలతోపాటు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. విద్యుత్ స్టేషన్లు మూత పడ్డాయి. కాగితం లేక వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల పరీక్షలను రద్దు చేశారు.
విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పరిష్కారం కోసం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చినా విపక్షాలు ఈ భేటీని బహిష్కరిస్తామని ప్రకటించాయి. నిత్యావసర సరుకులు కూడా లేక బతకడానికి దారి లేక లంకేయులు భారత్కు వలస బాట పట్టారు. కొంత మంది లంక పౌరులు మంగళవారం తెల్లవారుజాముకల్లా తమిళనాడు సరిహద్దుల్లో వదిలేందుకు ఒక పడవ యజమానికి రూ.50 వేలు చెల్లించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతున్నది. అయితే, రామేశ్వరంలో ఆరుగురు లంకేయులను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం మరో 10 మంది తమిళనాడుకు చేరారని సమాచారం.
1980వ దశకం చివరి నుంచి 1990వ దశకం మధ్య వరకు శ్రీలంకలో పౌర యుద్ధం సాగినన్ని రోజులూ లంకేయులు భారత్కు పోటెత్తేవారు. ఆ కాలంలో భారత్లోకి 90 వేల మందికి పైగా వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ తమిళనాడులోని పలు క్యాంపుల్లో జీవనం సాగిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు మనదేశంలోకి వచ్చిన మూడు లక్షల మందికి పైగా లంకేయుల్లో లక్ష మందిని అధికారికంగా శ్రీలంకకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ డేటా చెబుతున్నది.