న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో ప్రముఖ ర్యాపర్ కిర్నాన్ ఫోర్బ్స్ (35) దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. డర్బన్లోని ప్రముఖ రెస్టారెంట్ ఆవరణలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చిచంపారు. ఆయనపై ఏకంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కిర్నాన్ ఫోర్బ్స్ సౌతాఫ్రికాలో ర్యాపర్ అకాగా బాగా ప్రసిద్ధి చెందారు.
అకా హత్య విషయాన్ని అతని కుటుంబసభ్యులు కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బిడ్డ మరణం చాలా బాధాకరమని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, అకా హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియని, డర్బన్ పోలీసులు ఇచ్చే సమాచారం కోసం తాము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కాగా, అకా ఈ నెల 27న ‘మాస్ కౌంటీ’ పేరుతో తన కొత్త ఆల్బమ్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం.