కొలంబో : శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్ భవనంలో ఆయన కొత్త ప్రధానమంత్రితో అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. ద్వీప దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో దేశంలో సుస్థిరతను తీసుకునే ప్రయత్నంలో భాగంగా రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమించినట్లు యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన నేతలు తెలిపారు. విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది ఐదోసారి. తొలిసారిగా 1993-1994 వరకు ప్రధానిగా పని చేశారు. ఆ తర్వాత 2001-2004, 2015-2018 అక్టోబర్ వరకు, 2018 డిసెంబర్ నుంచి 2019 ప్రధానిగా సేవలందించారు. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్యం నిలువలు తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ క్రమంలో జనం ప్రధాని మహింద రాజపక్సతో పాటు అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. రాజకీయ పార్టీలు సైతం ప్రధాని మహింద గద్దెదిగాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చాయి. ఈ క్రమంలో చివరకు రెండు రోజుల కిందట పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు ఇంతకు ముందు ప్రధానిగా సేవలందించిన రణిల్ విక్రమసింఘేను నియమించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు మాజీ ప్రధాని మహింద రాజపక్సతో పాటు 15 మంది ఆయన అనుయాయులు దేశం విడిచి వెళ్లకుండా గురువారం శ్రీలంక కోర్టు నిషేధం విధించింది. రాజధాని కొలంబోలోని మేజిస్ట్రేట్ కోర్టు హింసపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. మహింద రాజీనామా అనంతరం జరిగిన హింసలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయి.. భారీగా ఆస్తి నష్టం జరిగింది.