కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఇవాళ ఆ దేశ పార్లమెంట్లో కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ మెజారిటీ సాధించారు. మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి వెళ్తూ ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన ఎంపీల ఎన్నికల్లో ఆ దేశ 8వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఎస్ఎల్పీపీ ఆయనకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవలే దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రజలు తిరగబడ్డారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. నిత్యావసరాలు, పెట్రోల్-డీజిల్ ధరలను నియంత్రించడంలో గొటబాయ ప్రభుత్వం విఫలమైంది. దీంతో ప్రజలు ఆగ్రహానికి గురై గోటబయను దేశం విడిచి వెళ్లేలా చేశారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలయ్యాయి. దాంట్లో నాలుగు ఓట్లు చెల్లలేదు. విక్రమసింఘేకు మద్దతుగా 134 మంది ఎంపీలు ఓటేశారు. దుల్లాస్కు 82, దిసనాయకేకు మూడు ఓట్లు పోలయ్యాయి. ప్రధానిగా విక్రమసింఘే ఆరుసార్లు పని చేశారు.