కొలంబో: శ్రీరాముడి భార్య సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకువెళ్లి లంకలోని అశోక వనంలో ఉంచిన రామాయణ కథ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అశోక వాటిక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నువరా ఎలియా ప్రాంతంలో ఉన్న ఆ అశోక వనానికి టూరిస్టులు ఎవ్వరూ రావడం లేదు. అక్కడ ఉన్న సీతా దేవి ఆలయం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా.. అశోక వాటిక ఆలయ మేనేజ్మెంట్ కూడా ఎన్నడూ లేని కష్టాన్ని ఎదుర్కొంటోంది. సీతామాత ఆలయ నిర్వహణ అత్యంత ఇబ్బందికరంగా మారిందని చైర్మెన్ వీ రాధాకృష్ణన్ తెలిపారు.
అశోక వాటికను చూసేందుకు ఉత్తర భారత నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని, కానీ ఇప్పుడు ఎవ్వరూ రావడం లేదని ఆయన అన్నారు. భక్తులు, టూరిస్టుల మీద ఆధారపడే ఈ ఆలయాన్ని ఇప్పుడు నడపడం కష్టంగా మారిందన్నారు. ప్రస్తుతం శ్రీలంకకు టూరిస్టులు వచ్చేందుకు జంకుతున్నారని, దీని వల్ల ఇక్కడ ఉన్న సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
చాన్నాళ్ల నుంచి తనకు ఆదాయం లేదని అశోక వాటికలో పనిచేస్తున్న టూర్ గైడ్ ఒకరు తెలిపారు. గతంలో ఎన్నడూ సీతామాత ఆలయాన్ని ఖాళీగా చూడలేదని, ఎప్పుడూ జనం పూజలు చేసేవారని, కానీ ఇప్పుడు భక్తుల కొరత ఉందన్నారు. విద్యుత్తు కోతలు, పెట్రోల్-డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్ల టూరిస్టులు రావడంలేదన్నారు.