మాస్కో: రష్యాలోని క్రోకస్ సిటీ హాల్లో జరిగిన కాల్పుల ఘటనలో 137 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడికి పాల్పడింది ఇస్లామిక్ తీవ్రవాదులు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) తెలిపారు. కానీ ఉక్రెయిన్ లబ్ది కోసమే ఆ దాడి జరిగినట్లు కూడా పుతిన్ ఆరోపించారు. ఆ దాడిలో కీవ్ పాత్ర ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. ఉగ్రవాద దాడితో ఉక్రెయిన్కు సంబంధం లేదని అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కాల్పులకు పాల్పడింది ఎవరో తెలిసిందని, కానీ ఆ ఆదేశాలు ఎవరు ఇచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేకుండా ఆ ఫైరింగ్ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు పుతిన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఓ మ్యూజిక్ కచరీ వేదిక వద్ద జరిగిన కాల్పుల ఘటనలో 130 మందికిపైగా మరణించారు. ఆయుధాలతో వచ్చిన అనేక మంది కాల్పులకు తెగించారు. హాల్లో బీభత్సం సృష్టించారు. అయితే ఆ దాడికి తామే పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ తెలిపింది. రష్యా దళాలు ఏడు మంది అనుమానితుల్ని ఆధీనంలోకి తీసుకున్నది. వాళ్లను తజిక్ తెగ వ్యక్తులుగా గుర్తించారు. ఆ ఉగ్రవాదులు ఉక్రెయిన్ దిశగా వెళ్తున్నట్లు తెలిసిందని పుతిన్ చెప్పారు.