కీవ్: చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మళ్లీ రేడియేషన్ పెరిగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్కు చెందిన న్యూక్లియర్ ఏజెన్సీ తెలిపింది. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని గురువారం రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ రష్యా సైనిక చర్యకు దిగడం వల్ల.. చెర్నోబిల్లో నేల ప్రాంతం కొంత ఒడిదిడుకులకు లోనైంది. దాని వల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అణుధార్మికత పెరిగినట్లు న్యూక్లియర్ ఏజెన్సీ పేర్కొన్నది. కానీ ప్లాంట్లో ఉన్న సదుపాయాలకు మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా.. తొలుత చెర్నోబిల్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ వల్ల యూరోప్ దేశాలకు ప్రమాదం ఉన్నట్లు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.
చెర్నోబిల్ను ఉగ్రవాదుల నుంచి రక్షిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ దేశ రక్షణశాఖ దీనిపై ప్రకటన రిలీజ్ చేసింది. తమ బలగాలు ఆ ప్లాంట్ను కాపాడుతున్నట్లు రష్యా తెలిపింది. ఉగ్రవాదులు ఆ ప్లాంట్లో విధ్వంసం సృష్టించకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు రష్యా వెల్లడించింది. అయితే ప్లాంట్ ప్రాంతంలో ప్రస్తుతం రేడియేషన్ నార్మల్ స్థాయిలో ఉన్నట్లు రష్యా చెబుతోంది.