మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్గా ఉంచాలని ఆర్మీ చీఫ్లను ఆదివారం ఆదేశించారు. ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు, నాటో దళాలు రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అణ్వాయుధ బలగాలను అప్రమత్తంగా ఉంచాలని సైనిక చీఫ్లను ఆదేశించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదివారం టీవీ ద్వారా ఆర్మీ చీఫ్లతో మాట్లాడారు. పశ్చిమ దేశాలు మనతో సఖ్యతగా లేకపోగా చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలు విధించడాన్ని మనం చూస్తున్నామని వారితో అన్నారు. అలాగే నాటో దేశాల సీనియర్ అధికారులు కూడా రష్యాకు వ్యతిరేకంగా దూకుడుగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ‘పూర్తి నిరోధక దళాలను ప్రత్యేక పోరాటానికి సిద్ధంగా ఉంచాలని రక్షణ మంత్రి, రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్ను ఆదేశిస్తున్నాను’ అని పుతిన్ చెప్పారు. దీనికి సరే అంటూ రష్యా రక్షణ మంత్రి షోయిగు బదులిచ్చారు.
కాగా, ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్గా ఉంచాలని ఆర్మీ చీఫ్లను పుతిన్ ఆదేశించడం మరింత ఆందోళన రేపుతున్నది. మరోవైపు అమెరికా తర్వాత రష్యాలోనే భారీగా అణ్వాయుధాలున్నాయి. అలాగే బాలిస్టిక్ క్షిపణులను కూడా రష్యా భారీగా నిల్వ చేసుకుంది.