మాస్కో: నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్లో యూదుల వారసత్వ లక్షణాలు ఉన్నట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ప్రధాని నఫ్తాలీ బెన్నెట్తో జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్ సారీ చెప్పారని ఇజ్రాయిల్ పీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో పేరన్కొన్నది. కానీ రష్యా అధ్యక్ష కార్యాలయం మాత్రం ఇద్దరు నేతల మధ్య కేవలం కుశల సంభాషణలు జరిగినట్లు చెప్పింది. రష్యా రిలీజ్ చేసిన ప్రటకనలో క్షమాపణల అంశం లేదు.
ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా .. ఆ దేశాన్ని డీనాజిఫై చేయనున్నట్లు తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగినట్లే ఇటీవల ఓ ఇంటర్వ్యలో సెర్గీ లవ్రోవ్ కూడా కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు. మాజీ నాజీ నియంత హిట్లర్లో యూదుల రక్తం ఉన్నట్లు ఆరోపించారు. నిజానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ యూద మతస్థుడు. కానీ ఉక్రెయిన్ నాజీ తరహా పాలన చేస్తున్నట్లు లవ్రోవ్ ఆరోపించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ లక్షల మంది యూదులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే.
లవ్రోవ్ వ్యాఖ్యలు ఇజ్రాయిల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ క్షమాపణలు డిమాండ్ చేసింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రంగంలోకి దిగారు. పుతిన్ చెప్పిన క్షమాపణలను ఇజ్రాయిల్ ప్రధాని బెన్నెట్ అంగీకరించినట్లు పీఎంవో వెల్లడించింది.యూదులు, హోలోకాస్ట్ పట్ల పుతిన్ తన స్పష్టమైన నిర్ణయాన్ని ఇవ్వడం పట్ల ఇజ్రాయిల్ థ్యాంక్స్ కూడా చెప్పింది. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన అంశంలో ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. పుతిన్ పట్ల కఠిన నిర్ణయం తీసుకోవడంలేదని ఇజ్రాయిల్ నిందలు ఎదుర్కొంటోంది.