కొలంబో : ద్రవ్యోల్బణం, విదేశీ మారకద్రవ్య సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతున్నది. దీంతో ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నది. ఇప్పటికే ద్వీప దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్ కొరతతో వేలాది హోటళ్లు మూతపడగా.. కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజా న్యూస్ప్రింట్ కొరత కారణంగా రెండు ప్రధాన వార్తాపత్రికల ప్రింటింగ్ను కంపెనీ నిలిపివేసింది.
ఉపాలి పబ్లికేషన్కు చెందిన ఆంగ్ల దినపత్రిక ‘ది ఐస్లాండ్’ సింహళీస్ ఎడిషన్, దివైనా పేపర్ల ప్రింటింగ్ను నిలిపివేస్తున్నామని, ఇకపై ఆన్లైన్ ఎడిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పే ర్కొంది. తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రింట్ ఎడిషన్ ప్రచురణ వాయిదా వేస్తున్నామని, పాఠకులకు విషయాన్ని తెలిపేందుకు చింతిస్తున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆదాయ మార్గాలు దెబ్బతీయడంతో ద్వీప దేశం విదేశీ మారక ద్రవ్యం సంక్షోభంలో చిక్కుకున్నది. ఇటీవల న్యూస్ప్రింట్ దిగుమతితో ధర గణనీయంగా పెరిగింది. అక్టోబర్ 1981 నుంచి ప్రింట్ అవుతున్న ‘ది ఐలాండ్’ వార్తా పత్రిక ఇప్పుడు ‘ఈ పేపర్’ మారాల్సిన పరిస్థితి ఎదురైంది.
లంకలో పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల పెట్రోల్ కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్రోల్ కోసం పంపుల్లోకి జనం వినియోగదారులు ఎగబడడంతో వారిని నియంత్రించేందుకు సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితి ఎదురైంది. చమురు కొనుగోలు కోసం వేలాది మంది గంటల తరబడి క్యూలో బారులు తీరాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. పెట్రోలు కొనేందుకు క్యూలో నిల్చున్న ముగ్గురు వృద్ధులు శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.