ముజఫరాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కొత్త ప్రధానిగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత సర్దార్ తన్వీర్ ఇలియాస్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీవోకే అధ్యక్షుడు బారిస్టర్ సుల్తాన్ మహమూద్, అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షత వహించారు. 2026 జూన్తో ముగియనున్న రాజ్యాంగ కాల వ్యవధికి కొత్త సభా నాయకుడి కోసం ఎన్నిక నిర్వహించారు. పీవోకేలోని ప్రతిపక్ష పార్టీలు పీపీపీ, పీఎంఎల్-ఎన్ ఈ ఎన్నికను బహిష్కరించి ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. దీంతో పీటీఐకి చెందిన తన్వీర్ ఇలియాస్ 33 ఓట్లతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 53 స్థానాల పీవోకే జాతీయ అసెంబ్లీలో అధికార పీటీఐకి 32 సీట్లు, పీపీపీకి 12, ముస్లిం లీగ్కు 7, జేకేపీపీ, ముస్లిం కాన్ఫరెన్స్కు ఒక్కో సీటు ఉన్నాయి.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీలో విబేధాల నేపథ్యంలో పీవోకే ప్రధాని సర్దార్ అబ్దుల్ ఖయ్యూమ్ నియాజీపై సొంత పార్టీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో ఈ నెల 14న ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేశారు. దీనికి ముందు అనుమానాస్పద కార్యక్రమాల ఆరోపణలపై ఐదుగురు మంత్రులను కేబినెట్ నుంచి ఆయన తొలగించారు.
కాగా, సర్దార్ అబ్దుల్ ఖయ్యూమ్ రాజీనామాతో ఖాళీ అయిన ప్రధాన మంత్రి పదవి భర్తీ కోసం పీవోకే అసెంబ్లీలో సోమవారం ఎన్నిక జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండటంతో పీటీఐ పార్టీ నేత సర్దార్ తన్వీర్ ఇలియాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం పీవోకే కొత్త ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు పీవోకేలో గత ఏడాది జరిగిన ఎన్నికలను భారత్ తిరస్కరించింది. అక్రమ ఆక్రమణను మభ్యపెట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.