Jinping Action | కొవిడ్ వ్యాప్తి సమయంలో చైనా ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. అప్పుడు ఆందోళనల్లో పాల్గొన్న పలువురు ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. ఈ విషయాన్ని బీబీసీ బయటపెట్టింది. కనిపించకుండా పోతున్న వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారని బీబీసీ తెలిపింది. వీరి అదృశ్యంపై జిన్పింగ్ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం.
చైనాలో కరోనా సృష్టించిన విధ్వంసం ప్రభావం నెమ్మదిగా ముగింపు దశకు చేరుకున్నది. ఒకప్పుడు కరోనా ఆంక్షలను నిరసిస్తూ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. అయితే, అప్పుడు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై ఇప్పుడు జిన్పింగ్ చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తున్నది. నిరసనల్లో పాల్గొన్న వారిని ఒక్కొక్కరుగా అదృశ్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటివరకు 100 మందిని చడీచప్పుడు చేయకుండా అదుపులోకి తీసుకుని అజ్ఞాతంలోకి తరలించినట్లు బీబీసీ తన నివేదికలో పేర్కొన్నది. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా వీరంతా ఆందోళనాకారులు కాకుండా అమెరికా, బ్రిటన్లో చదువుకుని వచ్చిన రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, సంగీతకారులు ఉన్నట్లు బీబీసీ వెల్లడించింది.
అదుపులోకి తీసుకున్న ఆందోళనకారులు ఏఏ సంస్థలకు చెందినవారు.. వారు గతంలో ఎలాంటి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.. వంటి సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. వాస్తవానికి, మహిళల హక్కుల కోసం గొంతు విప్పుతున్న వ్యక్తులపై జిన్పింగ్ ప్రభుత్వం కన్నేసి ఉంచింది. వీరితో ఆందోళనలకు దిగేలా ప్రేరేపించిన వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. భవిష్యత్లో ఏ విధంగానైనా నిరసన వాతావరణం రాకూడదని చైనా కోరుకుంటున్నది.
ఇలాఉండగా, జిన్పింగ్ చర్యలను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. అదుపులోకి తీసుకున్న వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్రమ మార్గాల్లో నిర్బంధించిన వ్యక్తుల జాబితాను కూడా ఒక సంస్థ విడుదల చేసినట్లుగా సమాచారం.