న్యూయార్క్, మార్చి 29: ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేసి స్లిప్ తీసుకొంటున్నారా? రెస్టారెంట్కు వెళ్లి ఏదైనా తినడానికి పేపర్ టోకెన్ తీసుకొంటున్నారా? అయితే మీరు విషంలో చేతులు ముంచినట్టేనని అంటున్నారు అమెరికాకు చెందిన ఎకాలజీ సెంటర్ పరిశోధకులు. ఏటీఎంలో వచ్చే పేపర్ స్లిప్లు, రెస్టారెంట్లు, ఇతర వినియోగ వస్తువులు కొనే దుకాణాల్లో ఇచ్చే స్లిప్పులపై అత్యంత ప్రమాదరకరమైన బిస్ఫినాల్ ఏ (బీపీఏ), బిస్ఫినాల్ ఎస్ (బీపీఎస్) వంటి విష రసాయనాలు పూస్తున్నారని ఎకాలజీ సెంటర్ పరిశోధకులు గుర్తించారు. ఈ విషం మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అమెరికాలోని 22 రాష్ర్టాల్లో 144 పెద్దపెద్ద గ్రాసరీ, డిపార్ట్మెంటల్, మెడికల్ షాపులు, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లలో ఇచ్చిన 374 స్లిప్పులను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘హార్మోన్లను దెబ్బతీసే బీపీఏ, బీపీఎస్ చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లటానికి ప్రధాన వాహకాలుగా ఈ రిసీట్లు పనిచేస్తున్నాయి. చాలామంది చిల్లర వర్తకులు బీపీఏ, బీపీఎస్ కోటింగ్ వేసిన రిసీట్లను వాడుతున్నారు’ అని ఎకాలజీ సెంటర్కు చెందిన పర్యావరణ ఆరోగ్య ఉద్యమకారిణి మెలిస్సా కూపర్ సార్జంట్ ఆందోళన వ్యక్తంచేశారు.