కైవ్: తమ దేశంలో కొద్ది భూభాగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను నిలువరించడానికి తాము శాంతియుత, దౌత్య మార్గాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. శాంతి చర్చలకు రష్యా విఘాతం చేసిందని ఆరోపించారు.
తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. వాటిని స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు వేర్పాటువాద నాయకులతో ఒప్పందాలపై సంతకం చేశారు. ఆ రాష్ట్రాలకు మిలటరీ సహకారం అందిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం తెల్లవారుజామున జాతినుద్దేశించి ప్రసంగించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, దేశంలోని భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రష్యా చర్యలను ఖండించిన ఆయన దౌత్యం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నామని చెప్పారు. తాము తమ సొంత భూమిలో ఉన్నామని, ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. రష్యాపై చర్య తీసుకోవాలని తమ మిత్ర దేశాలను కోరారు.