Sri Lanka | శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స తిరిగి శ్రీలంక తిరిగి రావడానికి ఇది సరైన సమయం కాదని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. గోటబయ లంకలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయన్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స లంక నుంచి మాల్దీవులు.. అక్కడి నుంచి సింగపూర్కు పోరిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద సంఖ్యలో అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టడంతో ఆయన దేశాన్ని వీడి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో గత నెల 20న రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ క్రమంలో ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్తో మాట్లాడారు. మాజీ అధ్యక్షుడు దేశానికి తిరిగి వస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఉద్రిక్తలకు రాజపక్స కుటుంబమే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం దారుణమైన పరిస్థితులను చూశామని, రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించిన అనంతరం పరిస్థితులు మెరుగుపడుతాయని రణిల్ విక్రమ సింఘే పేర్కొన్నారు.
రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు పూర్తయ్యాయన్నారు. తాము ఇప్పటికే దిగువకు చేరుకున్నామని, త్వరలోనే కోలుకుంటామన్న దీమాను వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజలు విదేశీ మారక ద్రవ్యం అడుగుంటడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధ్యక్షుడు అంగీకరించారు. ఆహారం, ఇంధనం, వంటగ్యాస్, మందులు తదితర నిత్యావసర వస్తువుల కోసం పెద్ద ఎత్తున బారులు ఉన్నాయని, ఈ పరిస్థితులు మెరుగుపడేందుకు కొద్ది నెలల సమయం పడుతుందన్నారు.