వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తన ఆదాయపన్ను వివరాలను వెల్లడించారు. శ్వేతసౌధం ఈ వివరాలను రిలీజ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ దంపతుల ఆదాయం గత ఏడాది చాలా తగ్గింది. ఆదాయపన్ను శాఖకు సమర్పించిన వివరాల ఆధారంగా ఈ విషయం తెలిసింది. బైడెన్ దంపతులు ఇద్దరూ 2020 సంవత్సరంలో ఆరు లక్షల($607,336) డాలర్లు ఆర్జించినట్లు తెలిపారు. అయితే మళ్లీ పన్నుల రూపంలో ప్రభుత్వానికి లక్షా 57 వేల డాలర్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 25.9 శాతం చొప్పున వారు ఆదాయపన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. బైడెన్ ఆదాయన వివరాలు ప్రకటించిన వైట్హౌజ్.. అమెరికా అధ్యక్ష సంప్రదాయాన్ని బైడెన్ మళ్లీ వెనక్కి తీసుకువచ్చారంటూ పేర్కొన్నది.
బైడెన్ దంపతుల ఆదాయం గత ఏడాది చాలా తగ్గింది. 2019లో ఆ ఇద్దరూ సుమారు పది లక్షల($985223) డాలర్లు సంపాదించారు. ప్రసంగాలు, పుస్తక విక్రయాల ద్వారా వారికి ఆ ఆదాయం వచ్చింది. 2020లో ఎక్కువ శాతం సమయాన్ని ఎన్నికల ప్రచారసభలకు కేటాయించడంతో వారి ఆదాయం పడిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో బైడెన్ తన 22 ఏళ్ల ట్యాక్స్ ఫైలింగ్స్ను రిలీజ్ చేశారు. 2020 సంవత్సరంలో పది ఛారిటీలకు సుమారు 30వేల డాలర్లు డొనేట్ చేశారు. గత 20 ఏళ్లలో ఆ ఇద్దరూ 70వేల డాలర్లు విరాళం ఇచ్చారు.
జో బైడెన్ ఆదాయం 1.2 మిలియన్ల డాలర్లు, జిల్ ఆదాయం 2.88 మిలియన్ల డాలర్లుగా చూపించారు. అధ్యక్షుడి హోదాలో బైడెన్ 4 లక్షల డాలర్లు జీతం రూపంలో తీసుకుంటున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తన అయిదేళ్ల పాలనలో ఆదాయపన్ను వివరాలను వెల్లడించని విషయం తెలిసిందే.