ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్లిద్దరూ. ఇద్దరికీ పండంటి బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత మరో బిడ్డ కోసం ప్రయత్నించారు. అయితే విధి వాళ్లను వెక్కిరించింది. ఆమెకు గర్భస్రావం కావడంతో ఆ బిడ్డ.. ఈ ప్రపంచాన్ని చూడకముందే కన్నుమూసింది. కొంతకాలం తర్వాత మరోసారి గర్భం దాల్చిందామె. మళ్లీ గర్భస్రావమే మిగిలింది. మూడోసారి కూడా గర్భస్రావం జరిగింది.
ఆ సమయంలో ఆమె కూడా చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. దాంతో మరోసారి గర్భం దాల్చాలంటేనే భయపడే స్థితి. అలాంటి ఆ తల్లికి గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చింది. ఈ విషయం డాక్టర్లు చెప్పడంతో నోరు తెరుచుకుని చూస్తుండిపోయిందామె. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెక్సాస్కు చెందిన కారా విన్హోల్డ్ వయసు 30 సంవత్సరాలు.
2018లో ఈ దంపతులకు తొలి సంతానం కలిగింది. ఆ తర్వాత మూడుసార్లు కారాకు గర్భస్రావం జరిగింది. మూడోసారి గర్భస్రావం సమయంలో ఆమె కూడా చనిపోయినంత పనైంది. ‘‘దాంతో మళ్లీ గర్భం దాల్చాలంటేనే భయమేసింది’’ అని కారా ఆ అనుభవాలను గుర్తు చేసుకుంది. అలాంటి ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నెల తప్పింది. నెల రోజుల తర్వాత మరోసారి తీసిన స్కానింగ్లో రెండో పిండం కూడా కనిపించింది.
అది చూసిన కారా షాకైపోయింది. ‘‘అదేంటి? మొదటి సారి స్కానింగ్లో రెండో బిడ్డ లేడు కదా?’’ అని డాక్టర్లను అడిగింది. ఆమె రెండు అండాలను విడుదల చేసి ఉంటుందని, అయితే ఆ రెండూ ఒకేసారి ఫలదీకరణం చెందలేదని డాక్టర్లు అన్నారు. దాదాపు ఒక వారం తేడాతో రెండు అండాలు పిండాలుగా మారాయి. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతున్నారని తెలిసి ఆమె సంతోషించింది.
ఇప్పుడు ఆమెకు డెలివరీ కూడా జరిగింది. ఆరు నిమిషాల తేడాతో పుట్టిన కవలలు ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. వాళ్లను చూసిన కారా దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ఆమె కథ ఇప్పుడు నెట్టింట కూడా తెగ వైరల్ అవుతోంది.