లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకు గురి చేస్తున్నది. బ్రిటన్లో కరోనా, కొత్త వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. క్రిస్మస్కు ముందు లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం ఇంగ్లాండ్లో లాక్డౌన్ను తోసిపుచ్చారు. ఒమిక్రాన్ డేటాను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. వచ్చే వారం తర్వాత లాక్డౌన్ను పరిశీలించనున్నట్లు మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో చెప్పారు. మంగళవారం బ్రిటన్లో కొత్తగా 90,629 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15వేలకుపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులున్నాయి. సోమవారం 91వేలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. మంగళవారం కరోనా కేసులు ప్రకటించిన అనంతరం ఆయన బోరిస్ జాన్సన్ వీడియో విడుదల చేశారు. పరిస్థితి విషమిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఒమిక్రాన్ గణంకాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని, అవసరమైతే క్రిస్మస్ తర్వాత చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు.
క్రిస్మస్ పండుగకు ప్రణాళికతో ప్రజలు ముందుకెళ్లొచ్చన్న ఆయన.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో క్వీన్ ఎలిజబెత్ తూర్పు ఇంగ్లాండ్లోని నార్ఫోక్లోని తన సాండ్రిగామ్ ఎస్టేట్లో సాంప్రదాయ క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకున్నారు. మహమ్మారి సందర్భంగా క్రిస్మస్ వేడుకలను క్వీన్ ఎలిజబెత్ రద్దు చేసుకోవడం వరుసగా ఇది రెండోసారి.