లండన్: విమానం ఏడు గంటలకుపైగా ఆలస్యమైంది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పైలట్ వారిపై అరిచాడు. కావాలనుకుంటే విమానం నుంచి దిగిపోవచ్చంటూ మండిపడ్డాడు. బ్రిటన్ రాజధాని లండన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 25న విజ్ఎయిర్ విమానం లండన్లోని గాట్విక్ విమానాశ్రయం నుంచి సైప్రస్లోని లార్నాకాకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఏడు గంటలకుపైగా ఆ విమానం టేకాఫ్ కాలేదు. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విమానంలో నిల్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకోసాగారు.
ఇంతలో ఒక పైలట్ ప్రయాణికుల వద్దకు వచ్చాడు. విమానం ఆలస్యానికి తమ తప్పు కాదని చెప్పాడు. ఓపిక పట్టాలని, శాంతి వహించాలని కోరాడు. అయితే విమానం ఇంకా టేకాఫ్ కాకపోవడంపై కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పైలట్ కూడా చిర్రెత్తాడు. తన సహనాన్ని కోల్పోయాడు. విమాన ప్రయాణికులపై రంకెలు వేశాడు. విమానం దిగిపోవాలని అనుకునేవారు చేతులు ఎత్తాలని అన్నాడు. ‘దయచేసి ఎవరు దిగాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి. మీరు దిగితే మేం ఈ రాత్రికి వెళ్లం. నాకు, నా సిబ్బందికి ఇది అవసరం లేదు. ఈ విషయం మీకు తెలుసు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం’ అని ఆ పైలట్ చెప్పాడు.
కాగా, హన్నా మేస్ అనే ప్రయాణికురాలు దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘విమానం ఏడు గంటలు ఆలస్యమైన తర్వాత ప్రయాణికులపై పైలట్ విరుచుకుపడ్డాడు. దిగిపోండి అంటూ అరిచాడు’ అని ఆమె పేర్కొంది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 20 లక్షలకుపైగా దీనిని చూశారు. అయితే చాలా మంది నెటిజన్లు ఆ పైలట్నే సమర్థించారు. విమానం ఆలస్యం వల్ల ఆయన పడుతున్న బాధను కూడా అర్థం చేసుకోవాలని కొందరు పేర్కొన్నారు.