బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో ఉన్న 109 అంతస్తుల సీఐటీఐసీ టవర్(Beijing Skyscraper)ను కొన్ని రోజుల క్రితం ఓ చిన్న విమానం ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఇవాళ చైనా ప్రకటన చేసింది. టవర్ను విమానంతో ఢీకొట్టిన పైలట్.. దీర్ఘకాల నిద్రలేమి, ఆందోళనతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. వ్యక్తిగత కారణాల కోసం అతను విమానంతో టవర్ను ఢీకొట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందాడు. అతని పేరు లియూగా గుర్తించారు. ఆ ప్రమాదంలో 13 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
టవర్ను ఢీకొన్న పైలట్ వయసు 66 ఏళ్లు. అతను బీజింగ్ నివాసితుడు. విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నట్లు చావోయాంగ్ జిల్లా ప్రభుత్వ అధికారి తెలిపారు. బలవన్మరణానికి పాల్పడాలన్న ఉద్దేశాన్ని పైలట్ లియూ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది. వ్యక్తిగత కారణాల వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు.
109 అంతస్తుల సీఐటీఐసీ టవర్ను చైనా జున్గా కూడా పిలుస్తారు. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న జోంగ్నాన్హైకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ భవంతి ఉన్నది. స్థానికులు ఆ టవర్ను ఓ అదృష్టంగా భావిస్తుంటారు.