వాషింగ్టన్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నది. దాదాపు అన్ని దేశాలు మహమ్మారికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ శుభవార్త చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు వచ్చే మార్చి నాటికి వ్యాక్సిన్ను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే కొవిడ్ -19 వ్యాక్సిన్ను తయారు చేస్తోందన్నారు. ప్రస్తుతం కంపెనీ కొత్త వేరియంట్ కోసం వ్యాక్సిన్ను సిద్ధం చేస్తుందని, మార్చి నాటికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నామన్నారు.
ఇప్పుడు ప్రజలకు రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణ అందిస్తున్నారు. మోడెర్నా ఫార్మాస్యూటికల్ సీఈవో స్టీఫెన్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచించారు. కంపెనీ బూస్టర్ డోస్ను సిద్ధం చేస్తోందని, ఇది 2022 చివరి నాటికి సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒమిక్రాన్తో పాటు మున్ముందు రాబోయే అన్ని వేరియంట్ల నుంచి రక్షణ అందిస్తుందని వివరించారు.