వాషింగ్టన్: మానవాళి విచ్చలవిడిగా విడుదలచేస్తున్న హానికారక వాయువులతో హిమశిఖరాలు నిలువెల్లా కరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీనదాలు గత ఏడాది గణనీయంగా తరిగిపోయాయి. వాతావరణ మార్పు సూచికలు రికార్డుస్థాయికి చేరుకోవడంతో వాటిని రక్షించుకోవడం మానవాళికి తప్పనిసరైందని ఐక్యరాజ్య సమితి పేర్కొన్నది. ఐక్య రాజ్యసమితిలోని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ఇటీవల విడుదలచేసిన వివరాల ప్రకారం ‘గడిచిన ఎనిమిదేండ్లలో ఎన్నడూ చూడనంత భూతాపం పెరిగింది. కార్బన్ డయాక్సైడ్, కర్బన ఉద్గారాల సాంద్రత స్థాయిలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అంటార్కిటిక్లో మంచు రికార్డు స్థాయిలో అత్యల్ప స్థాయికి పడిపోయింది. కొన్ని యూరోపియన్ హిమనీ నదాలు దారుణంగా కరిగిపోయాయి’ అని వార్షిక వాతావరణ సూచీలో డబ్ల్యూఎంవో పేర్కొన్నది.
భూతాపం వల్ల హిమానీనదాలు కరిగి సముద్ర మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. 2013-22 మధ్య ఏడాదికి సగటున 4.62 మిల్లీమీటర్లు పెరుగుతూ వచ్చాయి. 1993-2002 మధ్యకాలంలో ఇది రెండు రెట్లు వేగంగా పెరిగింది. డబ్ల్యూఎంవో అధ్యయనం ప్రకారం.. 2022లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1850-1900 కంటే 1.15 సెల్సియస్ అధికంగా ఉన్నది. కర్బన ఉద్గారాల సాంద్రతలు 2021లో అత్యధిక స్థాయికి పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ (సీవో2) సాంద్రతలు మిలియన్కు 415.7 లేదా పారిశ్రామిక పూర్వస్థాయిల్లో 49 (1750) శాతానికి చేరుకున్నాయి. మీథేన్ సాంద్రతలు 252 శాతానికి, నైట్రస్ ఆక్సైడ్ సాంద్రతలు 124 శాతానికి చేరుకున్నాయి. ప్రపంచంలోని హిమనీనదాల సగటు మందం 2021 అక్టోబర్ నుంచి 2020 అక్టోబర్ వరకు 1.3 మీటర్ల కంటే ఎక్కువగా తగ్గింది. గత పదేండ్ల సగటు కంటే ఇది ఎక్కువ. 1970 నుంచి 2022 వరకు సుమారు 30 మీటర్ల మందం మంచుకు నష్టం జరిగింది. శీతాకాలపు మంచు తగినంత లేకపోవడం, వేడిగాలుల కారణంగా, ఆల్ఫ్స్ ఐరోపాలో హిమానీనదం కూడా రికార్డు స్థాయిలో కరిగిపోతున్నది.