భారత ప్రభుత్వం పెట్రో, డీజిల్ పన్నులను తగ్గించిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసించారు. ఈ ప్రశంసలపై పాకిస్తాన్ ముస్లీమ్ లీగ్ నవాజ్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ ఆయనకు అంతగా నచ్చితే.. నిరభ్యంతరంగా భారత్కు వెళ్లిపోవచ్చు. అంటూ మరియం విరుచుకుపడ్డారు.
దాయాది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని తెగ మెచ్చుకున్నారు. పెట్రో, డీజిల్ పన్నులను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ ప్రశంసించారు. అమెరికా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. వాటిని బేఖాతర్ చేసిందన్నారు. ఇలా అమెరికాను పక్కనబెట్టి, దేశ ప్రజలకు రిలీఫ్ ఇవ్వడానికి రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసిందన్నారు.
క్వాద్ దేశాల్లో భారత్ సభ్య దేశమని, అయినా.. అగ్రరాజ్యం ఒత్తిడిని భారత్ తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. దేశానికి రిలీఫ్ ఇవ్వడానికే ఇలా చేసిందన్నారు. భారత దేశానికంటూ ఓ స్వతంత్రమైన విదేశీ విధానం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. తాను ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రత్యేక విదేశాంగ విధానం కోసం ప్రయత్నించానని, కానీ.. విదేశీ శక్తుల ప్రోద్బలంతో కొందరు అడ్డుకున్నారని పరోక్షంగా ప్రస్తుత ప్రధానిపై ఇమ్రాన్ విరుచుకుపడ్డారు.