ఇస్లామాబాద్: రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే పైలట్లు, క్యాబిన్ సిబ్బంది డ్యూటీకి రావద్దని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) తెలిపింది. ఉపవాసం ఉండే వారిని విమానంలో విధులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. (not to fly while on fast) ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఆన్ ఫ్లైట్ డ్యూటీ రోజులలో ఉపవాసం ఉండకూడదని పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి పీఐఏ సూచించింది.
కాగా, రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న పైలట్లు, సిబ్బంది విమానం నడిపితే వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలుగుతుందని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) తెలిపింది. దీనికి సంబంధించిన వైద్య సిఫార్సులను ఉదాహరించింది. ‘ఉపవాస సమయంలో శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ప్రతిచర్యలు మందగిస్తాయి. సత్తువ కూడా తగ్గుతుంది. కాబట్టి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఉపవాసం సమయంలో విమానంలో డ్యూటీ చేయడం మీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా హానికరం అని స్పష్టమవుతుంది’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో పైలట్ లేదా సిబ్బంది ఎవరైనా ఉపవాసం ఉంటే విమానం ఎక్కేందుకు వారిని అనుమతించబోమని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.