Economic Crisis | దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక రంగం కుదేలవడం, నిరుద్యోగం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో పొదుపు మంత్రం పాటిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా విద్యుత్తు రంగంలో భారీగా పేరుకుపోతున్న రుణాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు కీలక ప్రతిపాదనలను ప్రకటించింది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పెండ్లి మండపాళ్లు రాత్రిపూట తెరిచి ఉంచడంపై ఆంక్షలు విధించింది. రాత్రి 8:30 గంటలకల్లా షాపింగ్ మాల్స్, రాత్రి పది దాటేలోగా పెండ్లి మండపాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాన్లో భాగంగా పాకిస్థాన్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ పైనా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. మార్కెట్లు, మ్యారేజీ హాళ్లు, షాపింగ్ మాల్స్ను రాత్రిపూట త్వరగా మూసేయడం ద్వారా దాదాపు రూ.6 వేల కోట్లు పొదుపు చేయొచ్చని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.