ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాజాగా మరో విమర్శను ఎదుర్కొంటోంది. గత ఏడాది పాక్లో వరదలప్పుడు తుర్కియే పంపిన సహాయ సామాగ్రిని తాజాగా భూకంప సాయంగా తిరిగి ఆ దేశానికి పంపింది. పాకిస్థాన్కు చెందిన ఒక మీడియా జర్నలిస్ట్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. జీఎన్ఎన్ న్యూస్ చానెల్కు చెందిన జర్నలిస్ట్ షాహిద్ మసూద్ దీని గురించి వెల్లడించారు. పాకిస్థాన్ ఇటీవల సీ-130 విమానాల ద్వారా తుర్కియే భూకంప ప్రాంతాలకు సహాయక సామాగ్రిని పంపిందని తెలిపారు. అయితే గత ఏడాది పాకిస్థాన్లో వరదలు సంభవించినప్పుడు తుర్కియే పంపిన సహాయ సామాగ్రినే తిరిగి ఆ దేశానికి పంపినట్లు చెప్పారు. తుర్కియే సహాయ సామాగ్రిని రీప్యాక్ చేసి భూకంప సాయం పేరుతో మళ్లీ ఆ దేశానికి పంపారని ఆయన విమర్శించారు. దీంతో తుర్కియే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్కు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు ఈ చర్య మరో తలవంపులు తెచ్చినట్లయ్యింది.
కాగా, గత సోమవారం తెల్లవారుజామన తుర్కియే, సిరియా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఇరు దేశాల్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 45,000 దాటింది. వేలాది మంది గాయపడ్డారు. రెండు లక్షలకుపైగా అపార్ట్మెంట్లకు నష్టం వాటిల్లింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గడ్డకట్టే చలిని తట్టుకుని తాత్కాలిక శిబిరాల్లో ఉంటున్నారు.
మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే
భూకంపం సంభవించి 12 రోజులు గడిచినప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.