ImranKhan | పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆదివారం రాజీనామా చేయనున్నారని తెలుస్తున్నది. ఇస్లామాబాద్లో జరిగే బహిరంగభలో ఆయన తన రాజీనామా ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. విదేశీ నిధుల కేసులో సోమవారం పోలీసులు అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ఖాన్ తన పదవికి రాజీనామా చేయనున్నారని సమాచారం. తాను రాజీనామా చేయడంతోపాటు ముందస్తు ఎన్నికలకు వెళతారని, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరతారని ఇమ్రాన్ఖాన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
2019లో ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావెద్ బజ్వా పదవీ కాలాన్ని పొడిగించే విషయమై ఇమ్రాన్ఖాన్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని విమర్శలు ఉన్నాయి. తన పదవిని కాపాడుకునేందుకు సైన్యంలో విభజన తేవడానికి ప్రయత్నించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నది. దీంతో ఇమ్రాన్ఖాన్.. సైన్యం విశ్వాసాన్ని కోల్పోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ధరల పెరుగుదలకు ఇమ్రాన్ఖాన్ విధానాలే కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇమ్రాన్ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని మూడు మిత్రపక్షాలు సంకేతాలిచ్చాయి. పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లకు చెందిన 100 మంది ఎంపీలు ఇమ్రాన్ఖాన్ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి.
342 సభ్యులు గల నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ఖాన్ తన పదవిని కాపాడుకోవడానికి 172 మంది సభ్యుల మద్దతు సంపాదించుకోవాల్సి ఉంది. అందుకోసం విపక్షాల సభ్యుల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు మూటగట్టుకున్నారు. దీంతో సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ-ఇన్సాఫ్ (పీటీఈ) చెందిన 24 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపడం గమనార్హం.