లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం ఉంది. తోషఖానా కేసులో ఇమ్రాన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. లాహోర్లోని ఆయన నివాసం దగ్గర ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఇమ్రాన్పై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80కిపైగా కేసులు ఉన్నాయి.
అయితే, అందులో రెండు కేసులలో మాత్రం ఇమ్రాన్ ఖాన్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. వాటిలో గత ఏడాది ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళా మేజిస్ట్రేట్ను బెదిరించారనే ఆరోపణలపై నమోదైన కేసు కాగా, మరొకటి తోషాఖానా అవినీతి కేసు. అయితే మహిళా మెజిస్ట్రేట్ను బెదిరించిన కేసులో జారీ అయిన నాన్బెయిలబుల్ వారెంట్ను కోర్టు సస్పెండ్ చేసింది.
కానీ, తోషాఖానా కేసులో జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ మాత్రం అమల్లో ఉంది. ఈ క్రమంలో సోమవారం ఇస్లామాబాద్ కోర్టు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో లాహోర్లోని ఆయన నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేయనున్నారు.
ఏమిటీ తోషాఖానా కేసు..?
తోషాఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ. క్యాబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తుంది. పాకిస్థాన్ నేతలు, అధికారులకు వచ్చే బహుమతులను ఈ తోషాఖానాలో ఉంచుతారు. బహుమతి విలువ రూ.30,000 కంటే తక్కువగా ఉంటే.. పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి దాన్ని తన వద్ద ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఖరీదైన బహుమతులను తోషాఖానాలో ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పనిచేసిన కాలంలో ఖరీదైన బహుమతులను తోషాఖానాకు అప్పగించలేదని కేసు నమోదైంది.