Peshawar mosque blast | పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు. వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు.
పెషావర్ నగరంలోగల హై సెక్యూరిటీ జోన్లో ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. మసీదులో పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 400 మంది పోలీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన 100 మందిలో 97 మంది పోలీసు అధికారులు ఉన్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా పార్లమెంటుకు తెలిపారు.