ఇస్లామాబాద్ : అవిశ్వాస తీర్మానంపై కీలక ఓటింగ్కు ముందు పార్లమెంట్ దిగువ సభలో మెజారిటీ కోల్పోయిన క్రమంలో పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఈ గండం నుంచి గట్టెక్కుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి బంతి వరకూ తాను పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని అంతకుముందు పాక్ దేశీయాంగ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. పాలక పక్షానికి మిత్రపక్షంగా ఉన్న ముతహిద క్వామి మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎంపీ) విపక్షానికి మద్దతు తెలపడంతో పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ కోల్పోయారు.
342 మంది సభ్యులు కలిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు 172 మంది సభ్యుల బలం అవసరం. తాజాగా పాక్ విపక్షానికి 175 మంది సభ్యులు మద్దతిస్తున్నారు.విపక్షాల బలం పెరగడంతో అవిశ్వాస పరీక్షకు ముందే ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకుంటారని భావిస్తున్నారు.