Bajwa crorepathi | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఆరేండ్లలోనే కోటీశ్వరుడిగా మారారని పాకిస్తాన్కు చెందిన మీడియా కథనాలు వెలువరించాయి. ఆర్మీ చీఫ్ జనరల్గా ఉండి భార్య, కోడలు పేరిట అనేక ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించారని పాక్ పత్రికలు అభియోగాలు మోపింది. పదవీ విరమణకు 8 రోజుల ముందు ఆయనపై ఈ ఆరోపణలు రావడం పాకిస్తాన్లో చర్చనీయాంశంగా మారింది. జనరల్ బజ్వా పదవీ కాలం ఈ నెల 29తో ముగియనున్నది.
పాకిస్తాన్కు చెందిన ‘ఫాక్ట్ ఫోకస్’ పత్రికలో పాకిస్తానీ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ సమగ్ర వ్యాసం రాశారు. ఈ వ్యాసం ప్రకారం.. గత ఆరేండ్లలో బజ్వా బంధువులు, సన్నిహితులు కరాచీ, లాహోర్తోపాటు పాకిస్తాన్లోని పలు నగరాల్లో ఫామ్హౌస్లు నిర్మించారు. అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఆస్తులు కొన్నారు. ఈ ఆస్తుల విలువ 12.7 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
జనరల్ బజ్వా భార్య అయేషా అమ్జాద్, కోడలు మహనూర్ సబీర్, కొందరు కుటుంబ సభ్యుల పేరిట ఈ డీల్ జరిగింది. జనరల్ బజ్వా ప్రభుత్వానికి సమర్పిస్తున్న పన్ను రిటర్న్లు, ఆర్థిక నివేదికలు ఆరేండ్లలోనే ఆయన కోటిశ్వరుడయ్యాడని చెప్తున్నాయని జర్నలిస్ట్ నూరానీ సంవత్సరాలవారీగా లెక్కలను అందజేశారు. 2013 నుంచి 2017 వరకు ఆయన ఆస్తుల విలువలు మూడు సార్లు మార్చినట్లు ఆయన ఆరోపించారు.