ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆస్తులు, రాబడిపై విచారణకు పాకిస్తాన్ ప్రభుత్వం సంసిద్ధమైంది. ఇమ్రాన్ ఆస్తులు, ఆదాయ పత్రాలపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని ప్రధాని షెబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇమ్రాన్ పార్టీ పీటీఐకి చెందిన నలుగురు ఉద్యోగుల బ్యాంకుల ఖాతాలనూ ఆరా తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులను తాహిర్ ఇక్బాల్, మహ్మద్ నోమన్ అఫ్జల్, మహ్మద్ అర్షద్, మహ్మద్ రఫీఖ్లుగా గుర్తించారు. ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ ఉద్యోగులైన ఈ నలుగురు ప్రైవేట్ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నిధులు చేరినట్టు గుర్తించారు.
ఈ ఆధారాలతో వారిని అరెస్ట్ చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 2013 నుంచి 2022 మధ్య పార్టీ విదేశీ విరాళాలకు సంబంధించిన పత్రాల ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇండిపెండెంట్ ఆడిటర్లు ఈ ప్రక్రియను చేపట్టనుండగా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ తదుపరి చర్యలు చేపడతాయి.