Israel – Palestine Conflict | ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల కారణంగా ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా మరణించారు. 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున హఠాత్తుగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్లు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల ద్వారా మాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నగరాలపై మెరుపు దాడికి దిగారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారు. 1500 మందికిపైగా గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైన ఇజ్రాయెల్ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 232 మంది మరణించారు. మరో 1700 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. రాకెట్ కాల్పులు, సైరన్ శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతుండటంతో భారతీయ విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భారతీయ రాయబార కార్యాలయం విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతోంది. పలువురు విద్యార్థులను సమీపంలోని షెల్టర్లకు తరలించింది.
‘ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’ పేరుతో ఇజ్రాయెల్పై రాకెట్ దాడులకు పాల్పడింది తామేనని హమాస్ ప్రకటించింది. మొదటి 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించామని తెలిపింది. ‘దేవుడి సాయంతో మేం ఈ సమస్య అంతటికీ ముగింపు పలకాలనుకుంటున్నాం. దీంతో జవాబుదారీతనం లేకుండా నిర్లక్ష్యం వహించడం ముగిసిందని శత్రువు అర్థం చేసుకుంటాడు’ అని హమాస్ మిలిటెంట్ లీడర్ మొహమ్మద్ దీఫ్ ప్రకటించారు.
మిలిటెంట్ల దాడి ప్రభావం పవిత్ర జెరూసలెం నగరం, టెల్ అవీవ్తో పాటు ఇజ్రాయెల్ దక్షిణ, మధ్య ప్రాంతాలపైనా కనిపించింది. వందలాది మంది ప్రజలు భయంతో దుప్పట్లు, ఆహార పదార్థాలు చేత పట్టుకొని పరుగులు తీయడం కనిపించింది. ఇజ్రాయెల్లోకి చొరబడిన ఉగ్రవాదులు వీధుల్లోని పౌరులపై కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. షార్ హనెగెవ్ ప్రాంతీయ కౌన్సిల్లోని ఒక పట్టణాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన స్థానిక మేయర్ ఓఫిర్ లిబ్స్టెన్ ఉగ్రవాదుల దాడుల్లో మరణించారు. మరోవైపు ఇజ్రాయెల్పై హమాస్ దాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ఇరు వర్గాలు శత్రుత్వానికి ముగింపు పలికి పౌరులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ కష్ట సమయంలో ఇజ్రాయెల్కు అండగా ఉంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దాడులపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసులు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
గాజా ప్రాంతాన్ని హమాస్ 2007లో హస్తగతం చేసుకొన్న తర్వాత చాలా యుద్ధాల్లో ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్లు తలపడ్డారు. అయితే గాజన్ వర్కర్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఇజ్రాయెల్ సరిహద్దులు మూసేయడం తాజా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాలీయన్లు, ఇద్దరు విదేశీయులు చనిపోయారు. హమాస్ అయుధాలు పొందకుండా గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్, ఈజిప్ట్ గట్టి నియ్రంతణ విధించాయి. దీంతో చాలా మంది ప్రజలు కనీస అవసరాలైన ఆహారం, నీరు పొందడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. గాజా సరిహద్దుల్ని ఇజ్రాయెల్ మూసేయడం వల్ల, తమ ఇండ్లను ధ్వంసం చేయడం వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శతాబ్దాల నుంచి యుద్ధం కొనసాగుతున్నది. ఎపుడు ఉద్రిక్తతలు వస్తాయో.. ఏ సమయంలో రాకెట్లు వచ్చి పడతాయో తెలియకపోవడంతో ఇజ్రాయెల్ అమెరికా సాయంతో ఐరన్డోమ్ ఎయిర్ ఢిపెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నది. శత్రువుల రాకెట్లను, శతుఘ్నులను ఈ వ్యవస్థ గాల్లోనే తునాతునకలు చేస్తుంది. 2021 ఉద్రిక్తతల సమయంలో ఈ వ్యవస్థ వల్లే ఇజ్రాయెల్ స్వల్ప నష్టంతో బయటపడింది. కానీ ఈసారి ఈ వ్యవస్థ రాకెట్లను అడ్డుకోలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. అందుకే హమాస్ ఉగ్రవాదులు 5000 రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించారని విశ్లేషకులు చెప్తున్నారు.