ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతున్నది. పలు ప్రావిన్స్లో బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదలు పాకిస్థాన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. వర్షాలు, వరదలవల్ల పంటలు బాగా దెబ్బతినడంతో నిత్యావసరాలు ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యానికి తోడు అక్కడి ప్రభుత్వం ముందుచూపు లేమి కూడా ప్రజలను కష్టాలపాలు చేస్తున్నది.
సంక్షోభం కారణంగా ఒక లీటర్ పాల ధర రూ.150కి చేరింది. 2021 జనవరిలో కిలో రూ.36గా ఉన్న ఉల్లిగడ్డ ధర 2022 జనవరిలో రూ.220కి చేరింది. వీటితోపాటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. ముందుముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా పాకిస్థాన్లో ప్రధాన ఆహారం అయిన గోధుమలు, బియ్యం ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్లో గోధుమ పంట పూర్తిగా దెబ్బతినడంతో గోధుమ పిండికి తీవ్ర కొరత ఏర్పడింది. కిలో గోధుమ పిండి రూ.150కి చేరింది. బియ్యం ధర కూడా మునుపటి ధరకు రెండింతలయ్యింది. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా 48 శాతం రెట్టింపయ్యాయి.
వరదలవల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటానికి పాకిస్థాన్ భారీగా అప్పులు తీసుకొస్తున్నది. దాంతో 2011లో ఆ దేశ జీడీపీలో 52.8 శాతంగా, 2016లో 60.8 శాతంగా ఉన్న అప్పులు ప్రస్తుతం 77.8 శాతానికి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డాలర్తో పాకిస్థాన్ రూపీ మారకం విలువ కూడా రూ.177కు పతనమైంది.