వాషింగ్టన్, ఆగస్టు 6: అమెరికాలో శాశ్వత నివాసహోదాకు వీలు కల్పించే గ్రీన్కార్డు జారీలో జరుగుతున్న జాప్యం వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. ఈ ఏడాదికి కేటాయించిన కోటాలోని దాదాపు లక్ష గ్రీన్కార్డులు వృథాకానున్నట్టు తెలుస్తున్నది. అమెరికాలో ఉద్యోగం చేసే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించే ఉద్దేశంతో ఆ దేశ సర్కారు ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డులను జారీచేస్తున్నది. దీంట్లో భాగంగా ఏటా 1,40,000 కార్డులను ఇస్తున్నారు. అయితే, ఈ ఏడాది అదనంగా 1.20 లక్షల గ్రీన్కార్డులను చేరుస్తూ.. 2,61,500 గ్రీన్కార్డులను జారీ చేయాలని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. అయితే, అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం.. అమెరికాలో అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గ్రీన్కార్డుల జారీ కోటాను వచ్చే నెల 30లోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు కార్డులను జారీచేయని పక్షంలో మిగిలిపోయిన కార్డులు రద్దవుతాయి. కాగా, గ్రీన్కార్డుల జారీలో జాప్యంతో వచ్చే నెల 30లోపు లక్ష కార్డులు వృథా కానున్నాయని భారతీయ ఐటీ నిపుణుడు సందీప్ పవార్ మండిపడ్డారు. ఈ అంశంపై అమెరికాలోని ఓ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
కరోనా కారణంగానేనా..
వివిధ విభాగాల ప్రాతిపదికన అమెరికా ప్రభుత్వం విదేశీయులకు గ్రీన్కార్డులను జారీ చేస్తున్నది. ఇందులో కుటుంబ ఆధారిత గ్రీన్కార్డుల జారీ ఒకటి. అయితే, గతేడాది అమెరికాను కరోనా కుదిపేసింది. దీంతో కుటుంబ ఆధారిత గ్రీన్కార్డుల కోసం దరఖాస్తులు అనుకున్నంత స్థాయిలో రాలేదు. 2020 సెప్టెంబర్ 30నాటికి కుటుంబ ఆధారిత గ్రీన్కార్డుల కోటాలో మిగిలిపోయిన దాదాపు లక్ష గ్రీన్కార్డులను ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల సెగ్మెంట్లోకి మార్చారు. దీంతో ఈ ఏడాది అదనంగా లక్ష గ్రీన్కార్డులు వచ్చి చేరాయి. అయితే, అమెరికాలో కేసులు పెరుగడం, సిబ్బంది కొరతతో ఈ కార్డుల జారీలో జాప్యం తలెత్తింది.